టీమ్ఇండియాలో మళ్లీ చోటు దక్కించుకుంటానని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తన ప్రతిభ మీద తనకు ఎలాంటి అనుమానం లేదని బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. గతేడాది 2019 ప్రపంచకప్ తర్వాత భారత వన్డే జట్టులో కార్తీక్ చోటు కోల్పోయాడు.
‘టీ20ల్లో నా రికార్డు చాలా బాగుంది. మేం ప్రణాళిక వేసుకున్న విధంగా వన్డే ప్రపంచకప్లో ఫలితం రాలేదు. నన్ను వన్డే జట్టును ఎందుకు తప్పించారో అర్థం చేసుకోగలను. అయితే, టీ20ల్లో మాత్రం నాకు మళ్లీ చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నా. ఇటీవల దేశవాళీ క్రికెట్లోనూ బాగా ఆడా. నా మీద నేను అనుమానపడాల్సిన అవసరం లేదు(భారత జట్టులో పునరాగమనంపై)’ అని కార్తీక్ చెప్పాడు.
అలాగే ఐపీఎల్లో రాణిస్తే టీ20 ప్రపంచకప్లోనూ చోటు దక్కేందుకు అవకాశముంటుందని తనకు తెలుసునని కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా ఉన్న దినేశ్ కార్తీక్ తెలిపాడు. లాక్డౌన్ ముందు ఐపీఎల్ కోసం ఎంతో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. కరోనా వైరస్ను ప్రపంచం జయిస్తుందని దినేశ్ కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు తన 15ఏండ్ల కెరీర్లో కార్తీక్ టీమ్ఇండియా తరఫున 26టెస్టులు, 94వన్డేలు, 32 టీ20లు ఆడాడు.